Pawan Kalyan: 'పవన్ కల్యాణ్ దశమంతుడు.. ఆయన అడుగు ఎంతో మంచిది' అంటూ పిఠాపురం మత్స్యకారులు చెబుతున్న వీడియోను షేర్ చేసిన జనసేన

  • పవన్ అడుగుపెట్టిన తర్వాత మూడు నెలలపాటు సముద్రంలో చేపలు, రొయ్యలు పోటెత్తాయన్న మహిళలు
  • ఆ బాబు కోసం ఎదురుచూస్తున్నామన్న మత్స్యకార మహిళలు
  • పవన్ వస్తే మత్స్యకారులకు మంచి జరుగుతుందని ఆశాభావం
  • తామందరం ఆయనకే ఓటేసి గెలిపిస్తామని ధీమా
Pithapuram Fisherwoman Says Pawan Kalyan A Great Man

జనసేనాని పవన్ కల్యాణ్‌పై పిఠాపురం మత్స్యకారులు ఎనలేని అభిమానాన్ని కురిపిస్తున్నారు. ఆ బాబు (పవన్ కల్యాణ్) కాలు ఎంతో మంచిదని, ఒకసారి ఇక్కడికొచ్చి సముద్రం ఒడ్డున అడుగుపెట్టిన తర్వాత మూడు నెలలపాటు చేపలు, రొయ్యలు పోటెత్తాయని చెప్పుకొచ్చారు. పవన్ వచ్చాడు.. వేట పెరిగిందని అందరూ గొప్పగా చెప్పుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆ బాబు దశమంతుడని, ఈసారి మత్స్యకారులందరూ ఆయనకే ఓటేస్తారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. 

మత్స్యకారులు చాలా బాధల్లో ఉన్నారని, గంగమ్మకు పూజలు ఎలా చేయాలో తనకు తెలుసని అప్పట్లో పవన్ తమతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. శ్రీకాకుళంలో తాను గంగమ్మకు పూజలు చేయడం చూశానని, అక్కడ పాలు, కుంకుమ, పసుపుతో పూజలు చేస్తారని పవన్ తమతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. తాను గెలిస్తే అలాగే చేస్తానని పవన్ తమతో చెప్పారని, ఆ బాబు కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఆయనొస్తే మత్స్యకారులకు మంచి జరుగుతుందని చెప్పారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతకు ఈసారి ఓటువేసే ప్రసక్తే లేదన్నారు. ఆమె ఎప్పుడూ తమ వద్దకు రాలేదని, తాము ఎలాగున్నామో పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News